తెలుగు పరిశోధకులుగా పేరొందిన ” కోరాడ మహాదేవ శాస్త్రి “ గారు 1921 లో బందరు లో జన్మించారు. చెన్నపట్టణం ప్రెసిడెన్సీ కళాశాలలో చరిత్ర, ఆర్థిక శాస్త్రాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి సర్వ ప్రథములుగా 1952 లో డి. లిట్ పట్టా తో బాటు బంగారుపతకం కూడా అందుకొన్నారు. అన్నామలై, వేంకటేశ్వర విశ్వవిద్యాలయాలలో దశాబ్ద కాలానికి పైగా పనిచేశారు. తిరువనంతపురం లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ద్రావిడియన్ లింగ్విస్టిక్స్ కు గౌరవాధ్యక్షులుగా కూడా పనిచేశారు. అనేక పురస్కారాలను అందుకొన్నారు. ఎన్నో భాషా గ్రంథాలను వెలువరించారు.
శాస్త్రి గారి వర్థంతి సందర్భంగా …..
” సంస్మృతి ”
” కోరాడ ” వంశం అనగానే స్ఫురణ కి వచ్చే విశిష్టమైన సారస్వత విషయాల్లో మొదటిది ‘ మంజరీ మధుకరీయం‘ పేర వెలసిన ‘ ప్రప్రథమ తెలుగు నాటక ‘ ప్రక్రియ. రెండవది ” సంధి – సమాసం – ద్రావిడ భాష క్రమ విలాసనం “. మూడవది ‘తెలుగు శాసనాలు, భాషా పరిణామం, ద్రావిడ భాషా పద నిర్మాణం సిద్దాంతాలు‘. నాల్గవ అంశం ‘వేదాక్షర స్వరూపం ఈనాటి దృక్పథం‘, ‘సంస్కృత భాష వైజ్ఞానిక సాంకేతిక ప్రభావం‘, ‘అర్వాచీన ప్రపంచ భాషా సంప్రదాయాలు‘. భాషా సారస్వతాంశ పరిశోధనల అంశాలని, కోరాడ భాషా వేత్తలని ప్రస్తుతించిన వారిలో KL Janert – Director of Indology University of Cologne West Germany; T Burrow Boden, Professor of Sanskrit University of Oxford UK ; Suniti Kumar Chatterji, and Sukumar Sen, Professors of Comparative Philology, Calcutta from yester years ముఖ్యులు.
భాషా పరిశోధన, సాహిత్య విశ్లేషణ అన్న అంశాలు రెండూ అతి సంశ్లిష్ట ప్రవృత్తి కల్గిన సారస్వత అంశాలు. భారత దేశ భాషల విస్తృతి, ఘనత ఐదు అంశాలని ప్రపంచానికి అందించాయనటం అతిశయోక్తి కాదు. 1. సారస్వత తత్త్వాన్వేషణం – Literary Scholarship, 2. పరిశీలనాత్మక సారస్వతాధ్యయనం – Literary comprehensive Study, 3. సాహిత్య లక్ష్య లక్షణ వివేచనం – Study of basic and applied sciences of Literature, 4. కావ్య దర్శన మీమాంస – Literary critical theories, 5. సారస్వతానుశీలన మార్గాలు, అనుసరణ – Literary critical paths.
భాషా పరిశోధన విషయం లో ప్రపంచ భాషలలో ఏ భాష కైనా ఈ విషయాలు అంతర్నిహితం గా ఉండక తప్పదు. కొన్ని పరిమితుల వలన స్పష్టం గా ప్రతిపత్తి వ్యక్తం కాకపోవచ్చు. పరిశోధన ఏ విధం గా సాగినా ఒక సిద్దాంతాన్ని ప్రతిపాదించాలనేది ఈ కాలపు విమర్శకుల మాట. ఇది పాశ్చాత్యుల ఆలోచనా ప్రభావం వలన అనుసరిస్తున్న సిద్దాంతం. పరిశోధన అనే ప్రక్రియ ఆలోచన అన్వేషణ ల ఫలం. శాస్త్రీయమైన పద్ధతిలో సాధించిన దార్శనిక సత్యాల రూపాన్ని అక్షర బద్ధం చేసి సిద్దాంతాన్ని రూపొందించి ఆవిష్కరించటం సాహిత్య పరిశోధనలో పరమార్థం. పరిశోధనాత్మక సారస్వత సిద్దాంతాలు కావ్యానుశీలనం లో వినూత్న పరిశీలనా విధానం తెలియ చేస్తాయి. ప్రత్యేకమైన దృక్పథాలని కలిగిస్తాయి. వివేచనా శక్తిని పెంచుతాయి. సముచిత మైన సారస్వత విలువలని అందిస్తాయి. నియమాలని, నిబద్ధత నీ స్పష్టం చేస్తాయి. రస సిద్ధి నందిస్తాయి.
తర తరాలుగా భాషా సారస్వతాలకి అంకితమైన వంశాలలో ‘ కోరాడ ‘ వంశం ఒకటి. కోరాడ వంశీయులు 1800 నుండి 2017 వరకు ఈ సారస్వత విషయాలలో పరిశోధన సాగిస్తూనే ఉన్నారు. లోతులు చూస్తున్నారు. శాస్త్ర, సిద్దాంత, విమర్శనాత్మక, విశ్లేషణాపూర్వక, వివరణలు ప్రపంచానికి అందిస్తూనే ఉన్నారు. వేద వాజ్ఞ్మయ అవగాహనా విధానం, సంస్కృత వ్యాకరణం, ప్రాకృత భాషలు, ప్రాచీనాంధ్ర భాషా స్వరూపం, ద్రావిడ భాషా నిర్మాణ వైఖరులు, మాండలిక ప్రాంతీయ దేశీ భాషా విలాసనం, శాసన భాష, ఇలా అనేకాంశాల పరిశోధన సాగించి సిద్ధాంత పూర్వక విషయాలనందించారు. విమర్శనాపూర్వకం గా గ్రంథస్థ, వ్యావహారిక భాషల, మాండలికాల, తెలుగు భాషాధ్యయనం 1820 లో ఇంగ్లాండ్ నుంచి వచ్చి తెలుగు దేశ భాషల్లో ఒక క్రొత్త ఉద్యమం తెచ్చి తెలుగు భాషా సాహిత్యోద్ధారకునిగా పేరు పొందిన Charles Phillip Brown తో ఆరంభం అయింది. అంతే కాదు ” In 1925 I found Telugu Literature dead. In 30 years I raised it to Life ” అని ధైర్యం గా ప్రకటన చేసాడు. Caldwell తులనాత్మ విధానాలని ప్రవేశపెట్టి సంధించాడు. గిడుగు రామ్మూర్తి గారి పరిశ్రమ వలన ప్రజల్లో భాషా పరిజ్ఞ్ఞానం వ్యాపించటం తో శిష్ట వ్యావహారిక భాష, వ్యావహారిక తెలుగు వెలుగు లోకి వచ్చాయి. ఈ ప్రయత్నాన్ని చిలుకూరి నారాయణ గారు విస్తృతం గా వ్యాసాల రూపం లో వెలయించారు. కోరాడ రామకృష్ణయ్య గారు తెలుగు వ్యాకరణం, పదాల నిర్మాణం, సంధులు, సమాసాలు, అక్షర రూప వికల్పాలు, అన్య దేశ్యాలు, భాషా పరిణామశీలత, ప్రాచీనాంధ్ర కవుల సారస్వత విశేషాలు వంటి అంశాలనెన్నింటినో అనుశీలనాత్మక చర్చల్లోకి తెచ్చి తెలుగు భాషా శాస్త్ర విస్తీర్ణతని లోతుల్ని వెలుగు లోకి తెచ్చారు. గంటి జోగి సోమయాజి గారు తెలుగు మాండలీకాల్లో ప్రామాణిక పరిశోధనా గౌరవాన్ని పెంపు చేశారు.
కోరాడ మహాదేవ శాస్త్రి గారి భాషా వ్యవసాయం తెలుగు శాసనాలలో భాష, ద్రావిడ భాషల పదాల్లో పరిణామం, అన్య భాషల ప్రభావం, తెలుగు ప్రయోగ శీలత్వం, మాండలికాలు, పదాల నిర్మాణం, వాడకంలో ఎదురయ్యే సమస్యలు, పరిష్కార విధానాలు, తెలుగు లిపి, పరిణామాలు, లిపి సంస్కరణ పద్ధతులు వంటి అత్యంత ప్రయోజనకరమైన, అవసరమైన విద్యా అంశాలు తెలుగు వారికి అందాయి. మహాదేవ శాస్త్రి గారు విఖ్యాత ఆచార్య సునీతి కుమార్ ఛటర్జీ గారి దగ్గర పరిశోధన చేసి 1965 లో * The Historical Grammar of Telugu సిద్ధాంత వ్యాసం అందించి DLitt పట్టానందుకున్నారు. జర్మనీ లో భాషా శాస్త్ర ఆచార్యులుగా వ్యవహరించి * Descriptive Grammar and Hand Book of Modern Telugu రచించారు. 1976 – 1978 ప్రాంతం లో ‘ కొలోన్ సరస్వతీ సీరీస్‘ ప్రచురణ గా జర్మన్ రీసెర్చ్ అసోసియేషన్ వారి ఆర్ధిక సహాయంతో గ్రంథం ప్రచురితమయింది. 1954 లో * A folk Tale in Western Bhojpuri, * Dialectical differences in eleventh Century Telugu, * పాళీ భాషా వాఙ్మయములు, * పాజ్ఞన్నాయా శాసన భాషలో గ్రాంధిక వ్యావహారిక భాష లలో భేదములు,1984 లో * వ్యాకరణ దీపిక, 1985 లో * Hand book of Modern Telugu, 1986 లో * ఆంద్ర వాజ్మయ పరిచయము, 2003 లో * తెలుగు వ్యుత్పత్తి పద కోశం, 2003 లో * తెలుగు దేశ్య వ్యుత్పత్తి నిఘంటువు * 2014 లో భాష – సంస్కృతీ గ్రంధాలు రచించారు.
అపూర్వమైన విషయాలని, భిన్న భిన్న అంశాలని పొందుపరచారు. మహాదేవ శాస్త్రి గారు తన 90 వ ఏట ప్రచురించిన ‘ భాష సంస్కృతీ ‘ అన్న గ్రంధం వీరిని తెలుగు భాష సారస్వత రంగాలలో అత్యున్నత్తమ భాషా వేత్తగా నిరూపిస్తుంది. తెలుగు భాషా రంగం లో చిరస్థాయిగా నిలచే వైతాళికుడు ఈయన. అసిధారా వ్రతం గా పరిశోధన చేసి తెలుగు భాషకి అజరామరమైన సేవ చేశారు. వీరి ప్రజ్ఞాభిజ్ఞత, వైదుష్యం గణనీయమైనవి.
మన దేశం లో ఆర్యుల సంస్కృతీ భాషా విలాసనం గురించిన అధ్యయనం కోసం జరిగిన యుగ విభజన – ప్రాచీన హింద్వార్య భాష ( Old Indo Aryan – OIA ), మధ్య హింద్వార్య భాష ( Middle Indo Aryan – MIA ), ఆధునిక హింద్వార్య భాష ( New Indo Aryan – NIA ) సిద్ధాంతాల కనుగుణం గా భాషా పరిణామం దృష్టి లో పెట్టుకుని విశిష్ట మైన అంశాలని వెల్లడించారు.
ఆర్య భాషల మీద అనార్య భాషా ప్రభావాలు, సంస్కృతం లో ద్రావిడ ప్రతిదేయ పదాలు, ప్రాచీన మధ్యయుగ శాసన పదావళి, వైకృత పదావళి, విభక్తి పళ్ళటము, అర్థ సందిగ్ధతకు పరిష్కారం, తెలుగు భాషా ధ్వనులు ప్రధాన లక్షణాలు, ధ్వని మార్పు, అర్థ పరిణామం, తెలుగులో మణి ప్రవాళ శైలి, సంధిలో చారిత్రిక అవశేషాలు వంటి అపూర్వమైన వ్యాసాలు ప్రకటన చేశారు.
” శబ్ద ప్రతీకము ” ( భాష – సంస్కృతీ p 88 ) అన్న వ్యాసం తులనాత్మక పరిశోధనలకు ఆధారం కాగలదు. శాకపూణి, కాత్యాయనుడు, శౌనకుడు, ఉవ్వటుడు, భట్ట భాస్కరుడు, కృష్ణ సూరి, సాయణుడు మున్నగు వేదం భాష్యకారులు, నిరుక్తకారులు వేదాక్షర వాదానికి మార్గం ఏర్పాటు చేశారు. అక్షర దృష్టి తో సర్వ సృష్టినీ శబ్ద బ్రహ్మాన్ని నిర్వచించారు. అక్షరార్థమే సృష్టికారకమని ప్రకటించారు. అక్షరం విషయం లో ఆధునిక భాషా వేత్తల పరిశోధనలు ఆసక్తికరం. అర్థస్ఫురణ కలిగించే ధ్వనుల వలన ఏర్పడుతున్న తెలుగు భాషా పదాల నిర్మాణ వైఖరి భాషా పరిశోధనాలని క్రొత్త మార్గం లో నడిపించే అవకాశం ఉంది.
హ కారం – అర్థాతిశయం, ఇ కారం – ఆధారం ప్రేమ, సమీపార్థకం, న వ స మా అక్షరాలూ – సౌకుమార్యం కోమలత్వం, మూర్ధన్య పరుషాక్షరం – దుష్టత్వం, ఒ ఓ కారం – వక్రత, కుటిలత్వం, ఐ కారం – బోలుగా ఉండటం, ఉబ్బి ఉండటం, జ కారం – చిక్కదనం జిగట, ర కారం – గుండ్రం గా ఉండటం, స కారం – శబ్దం లేని కదలిక, అనుస్వారం – నిండుతనం – ఇలా అక్షరార్థం తెలియ చేసే విధానం పరిశోధనకు విషయం కాగలదు.
ఒకనాడు వ్యక్తుల చర్చల్లో, సమావేశాల్లో, సభల్లో, పరిషత్తులో, వ్యాస రచనల్లో ఉన్న తెలుగు వ్యవహార భాష, స్వరూపం, వ్యాకరణం, సాహిత్యం ఈరోజున సాహిత్య అకాడమీల్లో, పాఠశాలల్లో, విశ్వ విద్యాలయాల్లో పరిశోధనా రంగాల్లో, రాజకీయాల్లో, అంతర్జాతీయ వ్యాపార వ్యవహారాల్లో ప్రవేశం పొంది ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఈ విషయం లో కోరాడ వంశం అందించిన పరిశ్రమ విశిష్టం. ఆంద్రదేశం దాటి కోరాడ వంశం శాఖోపశాఖలై ప్రపంచమంతా విస్తరించింది. ఒక బృహత్తర ప్రణాళిక ఈ వంశీయుల విద్యా వ్యవసాయంలో భాగం.
తెలుగు పరిశోధనాసక్తి ఉన్నవారు ఇంకొక ముఖ్యమైన విషయం గ్రహించాలి. దాదాపు మూడు దశాబ్దాల కాలం పూర్వం నుండి కోరాడ మహాదేవ శాస్త్రి గారి వరకు తెలుగు భాషా శాస్త్రం ” Philology ” గా వ్యవహారం లో ప్రచారం లో ఉంది. ఆ తర్వాత ” Telugu Linguistics ” అని వ్యవహారం లోకి వచ్చింది. క్రమేణా భాషా శాస్త్రం ‘ Telugu Linguistics ‘ గా ప్రత్యేక స్థాయినీ, ప్రతిపత్తినీ సాధించింది. స్థిరపడింది. ఈ రోజున ‘ Philology ‘ వాడుక లో లేదు. భాషా శాస్త్రం ప్రధానం గా వర్ణనాత్మకం – Descriptive Science. Structure, collection of words, script development, inscriptions, manuscripts, copperplates, palm leaves, వర్గీకరణ, విషయం విశ్లేషణ, సామానీకరణ, archaeological evidence, anthropological models అన్నీ అత్యవసరమే. అవగాహన కావాలి. బహు వ్యవస్థల పరిశోధన కావాలి. కోరాడ వారి విద్యా వ్యవసాయం రామచంద్ర కవి గారి తో ఆరంభమై, రామకృష్ణయ్య గారి కాలం లో విస్తరించి మహాదేవ శాస్త్రి గారి నాటికి తెలుగు భాషా శాస్త్రం వినూత్న విశ్లేషణా విధానాలని, సమన్వయ పద్ధతులని ఉద్ఘాటించి, తర్వాతి తరాల వారి శ్రమ, సునిశిత భాషా నైపుణ్యం పరిశోధనల తో ప్రతిపాదనలని చెయ్యగలుగుతోంది.
కోరాడ మహాదేవ శాస్త్రిగారు తెలుగు శాసనాలు ఆధారం గా తెలుగు భాషా పరిణామాన్ని పరిశీలించి క్రొత్త విషయాలని పైకి తెచ్చారు. ఆధునిక భాషాశాస్త్ర నియమాలకు అనుగుణం గా, ఇప్పటి భాషా శాస్త్ర పద్ధతుల్లో తెలుగు చారిత్రిక వర్ణనాత్మక వ్యాకరణ సిద్దాంతాలని ప్రతిపాదన చేశారు. వృత్తి పద కోశ నిర్మాణం చేసి గ్రంథం అందించారు. భాషా సామాజిక పరిశోధన శాస్త్రిగారి వ్యవసాయం లో ఒక పంట. మహాదేవ శాస్త్రి గారు మహా మనీషులు కీర్తి శేషులు తండ్రిగారు రామకృష్ణయ్య గారు, మానవల్లి రామకృష్ణ, వేదం వెంకటరాయ శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, చిలుకూరి నారాయణ రావు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారల దగ్గర భాషా శాస్త్ర రహస్యాలని అధ్యయన పూర్వకం గా అందుకున్నారు. ప్రయోజనానికి రాని లిపి సంప్రదాయం పరిహరించటం, లాక్షణిక విరోధ పాఠాలు విడనాడటం, ప్రకరణ ఔచిత్యాన్ని గుర్తించటం, ఏక వాక్య సుదీర్ఘ వాక్యాలని సరళం గా వ్రాసే విధానాలు, ముఖ్యమని గ్రహించి ప్రతిపాదించారు. ప్రాచీన శబ్ద శాస్త్రం, నవీన భాషా శాస్త్రం వీరి అభిమాన దృక్పథాలు. తెలుగు భాషా పరిజ్ఞానానికి పరవస్తు చిన్నయ సూరి ‘ బాల వ్యాకరణము ‘, లక్ష్య పరిజ్ఞానానికి బహుజనపల్లి సీతారామయ్య గారి ‘ ప్రౌఢ వ్యాకరణము‘, శాసనస్థ లిపి, వీరి పరిశోధనకు మార్గదర్శకాలే అయినప్పటికీ భాష లక్ష్య లక్షణాల మధ్య ఉన్న ‘ సామాన్య – సాపేక్ష సంబంధాన్ని‘ తెలిసి సాధించటం తన గమ్యం గా పెట్టుకున్నారు.
బూదరాజు రాధాకృష్ణ, M కందప్ప చెట్టి, KK రంగనాథాచార్యులు వంటి మహామహులు మహాదేవ శాస్త్రి గారు సాగించిన పరిశోధనా విధానాలలోనే ముందుకు సాగి ప్రతిపాదనలు చేశారు. ద్రావిడ భాషా తులనాత్మక పరిశీలన, భాషా నిర్మాణ విధానాలు ప్రతిపాదించిన భద్రిరాజు కృష్ణ మూర్తి, తెలుగు భాష అర్థ నిర్మాణ సంబంధిత శాస్త్ర పరిశోధన చేసిన GN రెడ్డి, తెలుగు భాషా అన్య దేశ పద పరిశోధన చేసిన తూమాటి దోణప్ప, లకంసాని చక్రధర రావు, పరివర్తన సిద్దాంత ధోరణి లో సాగి తెలుగు భాషా శైలి శాస్త్ర నిర్మాణం చేసిన చేకూరి రామారావు, ద్రావిడ భాషా క్రియాపదాల నిర్మాణం తులనాత్మక పరిశోధన చేసిన PS సుబ్రహ్మణ్యం, తెలుగు భాషా పదాలలో ఉన్న వ్యవస్థనీ, ఆ వ్యవస్థ ఏర్పడేందుకున్న సిద్దాంతాలనీ వివరించిన వెన్నెలకంటి ప్రకాశం, అధికరణ సిద్దాంతం – Localist తెలుగు భాషలో కనిపిస్తున్న విధానం చెప్పిన బి రామకృష్ణా రెడ్డి, ఉత్పాదక అర్థ పరిణామ సిద్ధాంతం – generative Semantics అనుసరించి పరిశోధన చేసిన కిలారి నాగ ప్రభాకర రావు, గ్రామాలు పేర్ల మీద పరిశోధన చేసిన కేతు విశ్వనాధ రెడ్డి వంటి విశిష్ట తెలుగు భాషా వేత్తల తెలుగు భాషా శాస్త్ర దృష్టి, పరిశ్రమ తెలుగు భాషా స్థాయిని అంతర్జాతీయం చేసాయనటం నిర్వివాదాంశం.
కోరాడ కవుల భాషావేత్తల భాషా ప్రయోగ దృష్టి, శాస్త్ర అవగాహన ఇప్పటి వారికి స్ఫూర్తిదాయకమైంది. తర్వాతి తరాల వారికి మహాదేవ శాస్త్రిగారి మార్గం దృక్పథం సుగమ మార్గం చూపాయి. తెలుగు నిఘంటు నిర్మాణానికి, Desk Top Learning of Telugu Language Primers కి, పద కోశాలకి, పరిశోధనా గ్రంథాల ఆవిష్కరణకి, అనువాదాలకి, కావ్య రచనలకి, పద్య రచనలకి, వేదాక్షర స్వరూప సంబంధిత వ్యాస మాల గ్రంథాలకు ఆధారమయ్యాయి. పద ప్రయోగ కోశాలు, మాండలీక వృత్తి పద కోశాలు, సంస్కృత కావ్య, నాటకాల తెనిగింపు, సారస్వత పరిశోధనా గ్రంథాలు, పద్య కావ్యాలు, తెలుగు బోధనా గ్రంథాలు తెలుగు రంగానికి అందుతున్నాయి. పరిణామ దిశలో నడుస్తున్న ఈనాటి భాషా చైతన్యం పరిశోధనా సిద్దాంతాలకీ, ప్రమాణాలకీ, చారిత్రిక సమీక్షలకు, ప్రక్రియా విధానానికీ, శాస్త్రీయ దృష్టికీ, సింహావలోకనానికీ, సారస్వతావగాహనకీ సమాన గౌరవం ఇస్తూ నడిపిస్తూ ఉంది. అంతర్జాల పురోభివృద్ధి శాస్త్రీయ దృష్టిని బలవత్తరం చేస్తోంది. కళ నీ, తత్త్వాన్నీ, మతాన్నీ, విద్యనీ, వ్యక్తిగత మానసిక వ్యవస్థనీ అన్నిటినీ శాస్త్రీయ దృష్టి తో చూసి జీవన సార్థక్యత సంయమనం తో సాధించాలనే ప్రాథమిక సత్యాన్ని సాహిత్య వ్యవసాయం ద్వారా ప్రకటించిన కోరాడ వంశ మహనీయుల సాగిన మార్గం లో నడుస్తున్న ప్రస్తుత తరాల్లో కోరాడ కమలాదేవి, కోరాడ రామకృష్ణ, కోరాడ సూర్యనారాయణ, గుమ్ములూరి శ్రీకాంత, గుమ్ములూరి ఇందిర భారత దేశం నుంచి, శొంఠి శారదా పూర్ణ, శొంఠి సీత, గుమ్ములూరి సత్య, డా. శొంఠి సిరి తెలుగు సంస్కృత భాషలతో పాటు ఇతర ప్రపంచ భాషలలో ప్రావీణ్యాన్ని, వైదుష్యాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయిలో విదేశాలలో భాషా సారస్వత పరిశ్రమ చేస్తున్నారు.
తెలుగు భాషావగాహనా సమగ్రతకు దీపిక గా నిలచిన ప్రపంచ విఖ్యాత భాషా వేత్త కోరాడ మహాదేవ శాస్త్రి గారి దివ్య సంస్మృతికి జోడు చేతులొకటిగా నమస్కరిస్తున్న కోరాడ వంశీయుల సారస్వతాధ్యయన యజ్ఞం చిరంతనమవ్వాలని ఆశంసిస్తూ
– శొంఠి శారదా పూర్ణ , PhD Tel , PhD Sankrit, (D Litt – Tel, Music ) చికాగో, అమెరికా.
👉🏾ఈ అంశంపై మీ అభిప్రాయాలను ఈ క్రింద వ్యాఖ్యల పెట్టె (Leave a reply box) లో తెలియజేయండి👇🏾