10_019 సులోచన సులోచనాలు

Please visit this page

.

‘ తనకింకా 29 ఏళ్ళు పూర్తి అవలేదు. అప్పుడే దృష్టి ఆనడం లేదు ’ 

సులోచనకి కొంచెం సిల్లీగా, మరి కొంచెం సిగ్గుగా అనిపిస్తున్నది. 

మేడ మీద రూములో కొత్తగా ఇద్దరు బాచిలర్లు అద్దెకు వచ్చారు.
‘ వీళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళిచ్చే బాడుగ డబ్బులు తనకు, చన్నీళ్ళకు వేణ్ణీళ్ళుగా తోడ్పడుతున్నాయి ’  
మేడ మీదికి వెళ్ళి ‘ నిద్ర కళ్ళ మీద కాఫీ ఏం చేసుకుంటారు!? నేను ఇస్తాను. హోటల్ కాఫీకి ఇచ్చే రేటు కంటే తక్కువ ఇవ్వండి, చాలు కదా ! ’

బ్రహ్మచారులు పృధ్వి, రాజ్ ఉభయులూ సంతోషంగా తలలూపారు.

.

—————————————

.


సులోచన మధ్య తరగతి గృహిణి. డాబా గది ఎన్నో రిపేర్లు చేస్తేనే గది అని అనిపించుకుంటుంది. 

పై కప్పు కొన్నిచోట వర్షం కురుస్తుంది, కిటికీ రెక్క ఒక ఒకటి ఊడి వేళ్ళాడుతున్నది. 

గోడలు సున్నం ముఖం చూసి, పదేళ్ళు ఆయె. 

అత్యవసరంగా అద్దెకు దిగిన వాళ్ళు ఒకట్రెండు నెలల్లో వేరే ఇల్లు చూసుకుని మారిపోతున్నారు. 

అందుకే ఈసారి సులోచన కొత్తగా అద్దెకు వచ్చిన ఆగంతకుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది.
ఆమె భర్త గవర్నమెంటు ఆఫీసు లో క్లార్కు, జేబులో ఓ మూలకు ఇమిడే జీతం డబ్బులను బుద్ధిగా భార్య చేతిలో పోసేస్తాడు, 

‘ తన దగ్గర ఉంటే మాత్రం, ఆరేడు మేడలు కట్టేటంత మనీ వెనకేయ లేడు కదా ’

అందుకే పెళ్ళాం దోసిళ్ళలో పోసేసి, కళ్ళు అరమోడ్చి, జపం చేస్తూ నిశ్చింతగా కూర్చుంటాడు. 

సులోచన వరండా గోడకు – హనుమంతప్ప – నేమ్ బోర్డ్ – ని తుడిచి, రోజూ నీట్ గా ఉంచి, ఇష్టంగా చూసుకుంటుంది.
ఆమెకు భర్త అంటే ప్రేమ, జాలి కూడా. ‘ సగటు మనిషి కనబడని సంకెళ్ళు ధరించి, స్వీయ బందీ అయి ఉంటున్నాడు. అదృశ్య శృంఖల నిర్మాతలు ఎవరో, కనబడని ప్రశ్నార్ధకములు ఎన్నో ’   

.

—————————————

.

అన్నయ్య అనంతరాముడు – ఇక్కడ ఒక కేసును ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాడు. 

“భోంచెయ్యి, అన్నయ్యా”

” కాదమ్మా, కేసు పని అర్జెంట్ గా వెళ్తున్నాను. ఇంకోసారి వచ్చినప్పుడు తప్పకుండా నీచేతి వంట, మిస్సవను, సరేనా ” అని వెళ్లిపోయాడు.
అన్న మాట ప్రకారం అన్నయ్య అనంతరాముడు మరుసటి నెలలోనే వ చ్చాడు. సులోచన సంతోషంతో పలకరించింది. 

” ఇవాళ భోజనానికి వస్తాను ” అని చెప్పి బైటికి వెళ్ళాడు. 

” పోలీసెంకట్రాముడు వంద పనుల మీద వచ్చి ఉంటాడు ” నవ్వుతూ అన్నాడు ఆమె భర్త. 

.

————————————— 

.

” అంకుల్, ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, మేము చిత్తూరు వెళ్తున్నాం. గురువారం వస్తాము, ఆంటీకి చెప్పండి” అన్నారు అద్దెకుంటున్న బ్రహ్మచారులు.
వంట చేస్తూ, కృష్ణ నామాలను వల్లె వేస్తున్న సులోచన, వాళ్ళ మాటలు విని,

” సరే బాబూ, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి ” 

మడి కట్టుకుని, ఉన్నందున లోపలి నుండే జవాబు చెప్పింది సులోచన.
అపరాహ్ణం దాటాక, బైట గేటు దగ్గర జీపు దిగి వస్తున్నాడు అన్న.

సులోచన కంచాలు పెట్టి, మంచినీళ్ళు పెట్టి, వడ్డన ఏర్పాట్లలో నిమగ్నమైంది. 

అన్నం తిని, చెల్లెలి వంటను మెచ్చుకున్నాడు అనంతరాముడు.
తన మొబైలుని ఛార్జిలో పెట్టాడు.

” సార్, వాళ్ళ అడ్రసు దొరికింది ” అని మెసేజ్ ఇచ్చాడు కానిస్టేబుల్.

అనంతరాముడు ఆశ్చర్యపోయి, సర్దుకుని సులోచనను అడుగుదామని అనుకున్నాడు.
గాభరా పడుతుందని ఆగాడు.

నెమ్మదిగా ” చల్లగాలికి మేడ మీదికి వెళ్దాం, బావగారూ ” అని బావతో వెళ్తుంటే, 

” అరగంటలో దిగిరండి. కాఫీ తాగడానికి ”  అన్నది సులోచన. 

మేడ రూములో కూర్చుని, రేడియో వింటున్న యువకుడు జనార్దన్ ని, కాలర్ గుంజి పట్టుకుని కిందకు వచ్చాడు. 

హనుమంతప్ప వణికిపోతూ, 

” వీడు మా బంధువుల పిల్లాడు, జనార్దన్. బుద్ధిమంతుడు. మంచివాడు “

.


—————————————

.


పోలీస్ స్టేషనులో విస్తుబోయే విషయాలు విని, వాళ్ళ చెవుల్లో సీసం పోసినట్టయ్యింది. 

అద్దెకు వచ్చిన ఆ ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలు. బంగారం, విలువైన వస్తువులను దొంగిలించి, ఇతర ప్రదేశాలలో అమ్మి సొమ్ము చేసుకొనే నేర్పరులు.
దగ్గరలో ఉన్న ఇతర యువకులతో స్నేహం పెంచుకుని, కుయుక్తి పన్ని, వాళ్ళను తాము చేస్తున్న నేరాలలో ఇరికించి, తాము తప్పించుకుంటారు.
ఇదీ వాళ్ళ చోరకళ పద్ధతి.

సులోచన బంధువు – ఖాకీ డ్రెస్సు – జీపు గేటు దగ్గర ఆగి ఉండడం చూసారు. అందుకనే తట్టా బుట్టా సర్దుకున్నారు,
పెట్టే బేడా నెత్తిన పెట్టుకుని, చల్లగా జారుకున్నారు.

ఇంక ఇక్కడ – ఇక్కడ రేడియోలో విలువైన డైమండ్సును దాచి ఉంచుకున్నారు.

వాటిని మంచి బేరం రేటుకు విక్రయించడానికి రహస్య ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

ఈ లోపున – లాఠీవాలా రాక వాళ్ళ కుతంత్రాలకు గండి వేసింది.

ఇప్పుడు తెలివిగా – “మా సామాను చూస్తూ ఉండు.” అని చెప్పి, జనార్దనస్వామిని కూర్చుండబెట్టి, అర్జంటుగా … ఆ ఇరువురు లాఘవంగా తప్పించుకున్నారు. 

ట్రాన్సిస్టర్ లో – రత్నాలు, వజ్రాలు ఉన్నాయి అని తెలీని జనార్దనుడు, హాయిగా ఆకాశవాణి – వివిధభారతి గానసుధలను ఆస్వాదిస్తూ కూర్చున్నాడు.

బుల్లిపెట్టెతో సహా పోలీసులు పట్టుకుని, చరచరా పోలిస్ స్టేషన్ కి లాక్కెళ్ళారు.

పాపం, జనార్దనస్వామి రాశిఫలాలు – వార ఫలాలలో – ‘ నీ నొసట థర్డ్ డిగ్రీ వాయింపులు రాసిపెట్టి ఉన్నాయి ’ – అని  రాసి ఉన్నవి, కాబోలు- జనార్దన్ ఖాకీ లాఠీ దెబ్బలు తిన్నాడు.
ఇరుగు పొరుగు స్వచ్ఛందంగా పోలీస్ ఠాణాకు వచ్చారు, నిజం కోసం నిలడ్డారు, అందరూ ఏకకంఠంతో నొక్కి వక్కాణించారు –

” ఈ పిల్లాడికేమీ తెలీదు, జనార్దన్ అమాయకుడు ” –
ఆపద వేళలలో – తమ భారాన్ని పంచుకోవడానికి వచ్చిన స్నేహితులను చూసి, సులోచన కళ్ళు ఆనందబాష్పాలతో నిండాయి.
ప్రజల వత్తాసు, అందరి మాటలలోని నిజానిజాలు నిర్ధారించుకుని, జనార్దనాన్ని వదిలేసారు పోలీసులు.

” జగదంబ మనందరినీ రక్షించింది ” సులోచన దంపతులు నిట్టూర్చారు.

కర్ణాటక సరిహద్దుల వద్ద, గజదొంగలు పృధ్వి, రాజ్ దొరికారు.
ఈ కేసు ద్వారా, మరికొన్ని నేరాలు బైటపడ్డాయి, క్రూర నేరస్థులు పట్టుబడ్డారు. అనంతరాముడు గారికి అవార్డులు, పురస్కారాలు వచ్చాయి. 

ప్రమోషన్ లిస్టులో మొదటి పేరు అతనిదే. ఇంత భవిష్యత్తుకు రహదారి ఏర్పడడానికి కారణమైన చెల్లెలి ఇల్లు, స్వయంగా చూసి ఉన్నాడు కదా! 

సున్నం పెచ్చులు ఊడి, పురాతన స్థితిలో ఉన్న ఆ ఇంటికి కొత్త కళ వచ్చింది. 

అనంతరాముడు దగ్గర ఉండి, రిపేర్లు చేయించి, అదనంగా ఇంకొక గది కట్టించాడు. 

” అంతా మన మంచికే జరిగింది. అనవసరంగా కేసులో ఇరుక్కున్నామే, తెలీక అట్లాంటి వాళ్ళకి ఇల్లు ఇచ్చామే ” అనుకుంటూ అప్పటిదాకా భయపడుతున్న సులోచన, హనుమంతప్ప – గుండెల నిండా గాలి పీల్చుకున్నారు. 

అన్నగారి అండదండలు లభించడంతో నగరంలో హాస్టళ్ళ లో ఉన్న – హనుమంతప్ప, సులోచనల పిల్లల చదువులు కూడా, ఒడిదుడుకులు లేకుండా సాగుతున్నవి.  

.

—————————————

.

పృధ్వి వాళ్ళు ఇచ్చిన అడ్వాన్సు – సులోచన కళ్ళద్దాలు కొనడానికి ఉపయోగపడ్డాయి. 

” ఇంత చక్కని కంటి అద్దాలు కొన్నావు గానీ ఆ విలన్లను కనిపెట్టలేక పోయావు ” అన్నాడు హనుమంతప్ప.
” నిజమే, మీకు కూడా కవిత్వం మాట్లాడడం చేతనౌను – నాకిన్నాళ్ళూ తెలీ లేదు సుమీ ” అన్నది సులోచన నవ్వుతూ సులోచననాలను సర్దుకుంటూ…..

.

***************************

.