శశికిరణ్
(గాయకుడు, కర్ణాటిక సోదరులలో ఒకరు)
కర్ణాటక సంగీతం భక్తిమయం, అథ్యాత్మికం. సంగీతంలో ఎంత ప్రావీణ్యమున్నా సాహిత్యార్థం తెలియకపోతే వాగ్గేయకారుల భావాలను, సందేశాలను ప్రేక్షకులకు చేరవేసేదెలా? అందుకే కళాకారులకు సాహిత్యార్థం తెలుసుకోవడం తప్పనిసరి. ఈ కారణంగానే రాగభావంతో పాటు నేను నేర్చుకునే కీర్తనల భావాన్ని కూడా తప్పనిసరిగా తెలుసుకుంటాను. ఆయా వాగ్గేయకారులు ఆయా కీర్తనలను ఏ సందర్భంలో సృజించారు, ఎందుకు కూర్చారు వంటి చరిత్రకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకుంటాను. సాహిత్యం, సందర్భం, సందేశం అర్థమైతే కీర్తన కేవలం ఆలాపనగా మిగిలిపోదు. అది ఒక దృశ్యకావ్యంగా శ్రోతలను, ప్రేక్షకులను చేరుతుంది.
కర్ణాటక సంగీతంలో దాదాపు 65 శాతం తెలుగు సాహిత్యమే ఉంటుంది కాబట్టి మా నాన్నగారు చిత్రవీణ నరసింహన్ త్యాగరాజ, అన్నమయ్య కీర్తనలు, పదాలు, జావళీలలోని సాహిత్యాన్ని చక్కగా వివరించారు. సరైన చోట్ల ఊపిరి తీసుకోవడం నేర్పించారు. ఆయనకు తెలుగు క్షుణ్ణంగా వచ్చు మరి. ఇంకా పుస్తకాలు చదువుతాను, దేశ, విదేశాలలోని భాషా పండితులను సంప్రదిస్తూంటాను. అమెరికాలో స్థిరపడిన శ్రీధర్ చిట్యాల ఇప్పటివరకు 150 త్యాగరాజ కృతులను నాకు పంపించారు. వాటిలో వారానికి ఐదింటిమీద దృష్టి పెడుతూ నేర్చుకుంటున్నాను. అన్నమాచార్య ప్రాజెక్టుల్లో కూడా పాడుతూంటాను. తెలుగు మాతృభాష కాకపోయినా మాతృభాషకోసం చేయవలసినంత కృషినీ చేస్తున్నాను.
— శశికిరణ్
**********************************
👉🏾 ఈ అంశం పైన మీ అభిప్రాయాన్ని క్రింద వున్న Leave a reply box లో వ్రాయండి. 👇🏾
——– ( 0 ) ——-
Please visit this page