తో. లే. పి. – డా. భార్గవీరావు
కర్ణాటక రాష్ట్రం లో బళ్ళారి పట్టణం లో ఆగస్టు 14, 1944 న జన్మించిన భార్గవీ రావు గారు, తెలుగు సాహిత్యానికి సేవ చేసిన అనేక ప్రముఖులలో ఒకరు. పుట్టినది కర్ణాటక రాష్ట్రం లోనే అయినప్పటికీ, తెలుగు రాష్ట్రానికి సరిహద్దు లో ఉన్న ప్రదేశం కావడం తో ఆ భాష మీద మమకారము ఏర్పడి తన రచనలననేకం ఆమె తెలుగు భాష లో చేసారు. ఆమె భర్త ప్రభంజన రావు గారు. వీరి సంతానం : ముగ్గురు కుమార్తెలు ~ మిత్రవింద, శర్వాణి, సుస్మిత.
భార్గవీ రావు గారు ప్రతిష్టాత్మకమయిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. ఇతర భాషల నుండి తెలుగు లోనికి అనువాద రచనలను కూడా ఆమె చేయడం జరిగింది. కొన్ని ప్రాంతీయ చలన చిత్రాలలో ఆమె నటించి పేరు తెచ్చుకున్నారు. ఆమె వృత్తి రీత్యా ప్రొఫెసర్ – ప్రవృత్తిపరం గా రచయిత్రి, అనువాదకురాలు, కవయిత్రి.
భార్గవీ రావు గారు ప్రముఖ కన్నడ చలనచిత్ర నటుడు, రంగస్థల కళాకారుడు అయినా శ్రీ గిరీష్ కర్నాడ్ నాటిక “తలేదండ” ను తెలుగు లో అనువదించారు. ఈ రచన ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది.
ఇవి కాక ఆమె ఇతర రచనలు…. తెలుగు లో :
నీడలగోడలు — పద్య కావ్యం
గుండెలో తడి — చిన్న కథలు
చుక్క నవ్వింది నాపేరు — ”
సౌగంధిక — ”
ఊర్వశి — కూచిపూడి నృత్య రూపకం ( శ్రీమతి వారణాసి నాగ లక్ష్మి గారితో కలిసి )
నూరు వరహాలు — కథా సంకలనం
ఇంకానా – ఇక పైన సాగదు — దళిత వర్గాల స్థితి పై రచన
ఆహా – ఓహో — హాస్య రచన
నూరేళ్ళ పంట — 20 వ శతాబ్ది తెలుగు రచయిత్రుల 100 రచనల సంకలనం
ఇంగ్లీషు భాష లో :
Pebbles on the Shore — Short Stories
Hiccups — Poems
భార్గవీ రావు గారు అనేక ప్రతిష్టాత్మకమయిన జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు.
1995 – కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం — ” తలెదండ ” కన్నడ రచనకు తెలుగు అనువాదం
1999 – పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయ పురస్కారం
2000 – సఖ్య సాహితీ పురస్కారం
2001 – గృహలక్ష్మి పురస్కారం
TANA తెలుగు లిటరరీ కల్చరల్ సంస్థ సభ్యత్వం
స్వాతి పత్రిక అప్పటిలో నిర్వహించిన ఒక రచనల పోటీ లో వీరి రచన ” పుత్ర కామేష్టి ” బహుమతి ని గెలుచుకుంది.
భార్గవీ రావు గారి రచనలు సమీక్ష చేస్తూ వారికి నేను వ్రాసిన ఉత్తరం లో ఒక చోట వారి బాల్యాన్ని గురించి కాకతాళీయం గా ప్రస్తావించడం జరిగింది – ఆ సందర్భం గా చెన్నై లో తన చిన్నతనం లో గడిపిన రోజులు, రేడియో తాతయ్య గా పేరు గన్న శ్రీ మల్లంపల్లి ఉమామహేశ్వర రావు ( ‘ఉమ ‘) గారితో తన అనుబంధాన్ని వివరిస్తూ నాకు భార్గవీ రావు గారు ప్రత్యుత్తరం ఇచ్చారు. ఇదిగో ! ఆ ఉత్తరమే ఈనాటి ‘ తోక లేని పిట్ట ’.
కానీ — ఇక అసలు విషాదకర విషయం ఏమంటే –
శ్రీమతి డాక్టర్ భార్గవీ రావు గారు కొద్దిపాటి అస్వస్థత కు లోనై తన 64 వ ఏట — 14/08/2008 న కాలం చేయడం !– కాగా, మనమంతా వాస్తవానికి కేవలం నిమిత్త మాత్రులం – ఈ ఘటన ను ఒక భగవల్లీల గా భావించక తప్పదు !!
—————- ధన్యవాదాలు…. నమస్తే ————-
6. పారిజాత సౌరభము – సమీక్ష… 8. ద్విభాషితాలు – బాబయ్య గారి అరుగు…